కలం, ములుగు: ములుగు (Mulugu) జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన ఎన్డీపీఎస్ (NDPS) కేసులలో స్వాధీనం చేసుకున్న రూ.33.50 లక్షల విలువైన 67.013 కిలోల ఎండు గంజాయిని గురువారం చట్టప్రకారం పూర్తిగా దహనం చేశారు. ‘ఈగల్’ ఆదేశాల మేరకు జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ సమావేశం నిర్వహించి, న్యాయస్థానం అనుమతి అనంతరం ఈ ప్రక్రియ చేపట్టారు. జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకాన్ ఆదేశాల మేరకు డీసీఆర్బీ డీఎస్పీ ఈ. కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
వరంగల్లోని కాకతీయ మెడివేస్ట్ యూనిట్లో ప్రత్యేక యంత్రాల ద్వారా స్వాధీనం చేసుకున్న గంజాయిని పూర్తిగా దహనం చేసి నాశనం చేశారు. ఈ కార్యక్రమంలో మంగపేట ఎస్ఐ టీవీకే సూరి, డీసీఆర్బీ ఎస్ఐ ఎన్. వెంకటేష్తో పాటు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ కిషోర్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలు, వినియోగంపై పోలీసు శాఖ కఠిన చర్యలు కొనసాగిస్తుందని హెచ్చరించారు.
గంజాయి సాగు, రవాణా, విక్రయాలు లేదా మాదక ద్రవ్యాల అక్రమ కార్యకలాపాలలో పాల్గొనే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే పీడీ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు తెలియజేయాలని అధికారులు సూచించారు.

