కలం, వెబ్ డెస్క్ : ఫీజు రీయింబర్స్మెంట్ (Fee Reimbursement) పిటిషన్లపై హైకోర్టులో కీలక విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ తరఫు న్యాయవాది న్యాయస్థానానికి కీలక విషయాలను వెల్లడించారు. ఈసారి కొత్త అడ్మిషన్లతో పాటు రెండు, మూడు, నాల్గవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు కూడా ఫీజులు చెల్లిస్తామని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి మొత్తం బకాయిలు దాదాపు వెయ్యి కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని రాబోయే ఆగస్టు 15 లోపు చెల్లిస్తామని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. అయితే, జీవొ నెం.9 లోని కొన్ని నిబంధనలపై గత విచారణలో హైకోర్టు విధించిన మధ్యంతర నిలుపుదల ఉత్తర్వులను (స్టే) ఎత్తివేయాలని ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థించారు. ఈ స్టే కొనసాగడం వల్ల కొత్తగా చేరిన విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
మరోవైపు, ప్రభుత్వ విజ్ఞప్తిపై ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. కాలేజీల యాజమాన్యాల తరఫు లాయర్ స్పందిస్తూ.. ప్రభుత్వం చాలా కాలంగా ఫీజు రీయింబర్స్మెంట్ (Fee Reimbursement) బకాయిలను చెల్లించడం లేదని ఆరోపించారు. 2023 నుంచి ఈ బకాయిలు పేరుకుపోతూ వస్తున్నాయని, ప్రస్తుతం వీటి విలువ దాదాపు పది వేల కోట్ల రూపాయల వరకు ఉందని కోర్టుకు తెలిపారు. కొంత గడువు విధించి అయినా ఈ బకాయిలను పూర్తిగా చెల్లించేలా ప్రభుత్వానికి తగిన సూచనలు చేయాలని యాజమాన్యాల తరఫు న్యాయవాది హైకోర్టును రిక్వెస్ట్ చేశారు.

