కలం, వెబ్ డెస్క్ : నల్గొండ జిల్లా చిట్యాల (Chityala) మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన కొండె రఘుపతి అనే యువకుడు తన ఏళ్ల నాటి కలను వినూత్న రీతిలో నెరవేర్చుకున్నాడు. చాలా కాలంగా బైక్ కొనాలనే బలమైన కోరిక ఉన్న రఘుపతి, ఇందుకోసం రూపాయి రూపాయి పొదుపు చేస్తూ వచ్చాడు. అయితే సాధారణ నోట్ల రూపంలో కాకుండా, ఏకంగా పది రూపాయల నాణేలను సేకరించడం ప్రారంభించాడు. అలా దాదాపు లక్షా పది వేల రూపాయల విలువైన పది రూపాయల నాణేలను పోగు చేశాడు.
తాజాగా ఆ నాణేల మూటలతో స్థానిక ద్విచక్ర వాహన షోరూమ్కు చేరుకున్న రఘుపతి, తనకు నచ్చిన కొత్త బైక్ను కొనుగోలు చేశాడు. ఒకేసారి అన్ని పది రూపాయల కాయిన్స్ చూసి షోరూం నిర్వాహకులు మొదట ఆశ్చర్యపోయారు. అనంతరం ఆ మొత్తాన్ని లెక్కించేందుకు షోరూం సిబ్బంది రంగంలోకి దిగాల్సి వచ్చింది. వేల సంఖ్యలో ఉన్న ఆ నాణేలను పూర్తిగా లెక్కించడానికి సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ఎట్టకేలకు కౌంటింగ్ పూర్తి కావడంతో రఘుపతి తాను ఎంతో కాలంగా కలలుగంటున్న బైక్ కీస్ అందుకుని ఆనందంగా ఇంటికి తిరిగాడు. ఈ ఆసక్తికర ఘటన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

