కలం, స్పోర్ట్స్: శ్రీలంక పర్యటనలో ఉన్న భారత్ అండర్-19 జట్టు రెండో వన్డేలో అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. సోమవారం హంబన్తోటలో శ్రీలంక ‘ఎ’ జట్టుతో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 47.2 ఓవర్లలో 285 పరుగుల భారీ స్కోరు సాధించి ఆలౌటైంది. భారత మాజీ కెప్టెన్, కోచ్ రాహుల్ ద్రావిడ్ చిన్న కుమారుడు, వికెట్ కీపర్ బ్యాటర్ అన్వయ్ ద్రావిడ్ (Anvay Dravid) 87 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచి జట్టును ఆదుకున్నాడు.
ఈ మ్యాచ్లో భారత ఇన్నింగ్స్ ఆరంభం అంతగా సాగలేదు. కేవలం 11 పరుగులకే ఓపెనర్లు కెప్టెన్ యశ్బర్ధన్ చౌహాన్ (6), సాగర్ విర్క్ (4) వికెట్లను కోల్పోయి జట్టు కష్టాల్లో పడింది. ఆ దశలో కుశాగ్ర ఓఝా (38), వీకే వినీత్ (24) నిలకడగా ఆడి మూడో వికెట్కు 67 పరుగులు జోడించి ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. అయితే వీరిద్దరూ అవుటయ్యాక భారత్ 19వ ఓవర్లో 81 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి మళ్లీ ఇబ్బందుల్లో పడింది.
ఐదో స్థానంలో క్రీజులోకి వచ్చిన 17 ఏళ్ల అన్వయ్ ద్రావిడ్ (Anvay Dravid), అర్జున్ రాజ్పుత్ (76)తో కలిసి అద్భుత పోరాటం చేశాడు. వీరిద్దరూ ఐదో వికెట్కు కేవలం 126 బంతుల్లోనే 145 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అన్వయ్ 129.85 స్ట్రైక్ రేట్తో, కేవలం 47 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొదటి వన్డేలో 14 పరుగులకే అవుటైన అన్వయ్, ఈ మ్యాచ్లో మాత్రం అద్భుతంగా పుంజుకున్నాడు. శ్రీలంక బౌలర్లలో లెఫ్ట్ ఆర్మ్ సీమర్ గిమ్హాన్ మెండిస్ 41 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.
ఇటీవలే అన్వయ్ వినూ మన్కడ్ ట్రోఫీలో కర్ణాటక అండర్-19 జట్టును క్వార్టర్ ఫైనల్స్కు నడిపించి, 55 సగటుతో 220 పరుగులు చేశాడు. మరోవైపు, ఆదివారం జరిగిన మహారాజా ట్రోఫీ టీ20 మ్యాచ్లో అన్వయ్ అన్న సమిత్ ద్రావిడ్ కూడా బ్యాట్, బాల్తో రాణించి బెంగళూరు బ్లాస్టర్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మూడు వన్డేలు, రెండు నాలుగు రోజుల మ్యాచ్ల కోసం భారత జట్టు శ్రీలంకలో పర్యటిస్తోంది.
Read Also: డీఎస్పీ భీమ్ రెడ్డి అరెస్ట్
Follow Us On: Instagram

