కలం, భువనగిరి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి (VasalaMarri) గ్రామంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో గ్రామంలో కొనసాగుతున్న వివిధ ప్రగతి పనులను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సోమవారం పరిశీలించారు. అధికారులతో కలిసి ‘మార్నింగ్ వాక్’ చేస్తూ గ్రామంలోని వీధి వీధినీ క్షేత్రస్థాయిలో సందర్శించారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో భాగంగా గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లు, ప్రభుత్వ పాఠశాల నూతన భవన నిర్మాణం, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ సరఫరా మౌలిక వసతుల పనులను ఎమ్మెల్యే పరిశీలించారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో ముచ్చటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ పనులను జాప్యం లేకుండా వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల సమగ్ర వికాసానికి కట్టుబడి ఉందన్నారు. అందులో భాగంగానే వాసాలమర్రి గ్రామాన్ని రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు.
ఈ నెలలో వాసాలమర్రిలో (VasalaMarri) ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘ఇందిరమ్మ ఇళ్ల సామూహిక గృహప్రవేశాల’ మహోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారని తెలిపారు. సీఎం పర్యటన ఖరారైనందున, ఆలోపే గ్రామంలోని అన్ని పనులను పూర్తి చేయాలన్నారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ భాస్కరరావు, వివిధ శాఖల జిల్లా ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా, మండల స్థాయి అధికారులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.
Read Also: సంచలన రిపోర్ట్.. ఆ విషయంలో దేశంలోనే హైదరాబాద్ టాప్..!
Follow Us On: Instagram

