కలం, మెదక్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టును (Kaleshwaram) ప్రపంచంలోనే ఎనిమిదో వింత అన్న పెద్ద మనిషి కేసీఆర్ ఇప్పటికైనా అసెంబ్లీకి రావాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy) డిమాండ్ చేశారు. ప్రాజెక్టు ఎలా కట్టారో చెప్పి, తాము చేసిన పాపాన్ని అసెంబ్లీ సాక్షిగా కడుక్కోవాలని బీఆర్ఎస్ అధినేతకు సూచించారు. గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండలంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్తో కలిసి పాల్గొన్నారు.
పేదవాడికి ఇల్లు కట్టించలేదు..
మంత్రి పొంగులేటి (Minister Ponguleti) మాట్లాడుతూ.. కాళేశ్వరం కట్టింది, ప్రారంభించింది, కూలిపోయింది కూడా బీఆర్ఎస్ హయాంలోనే అన్నారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు దగ్గరకు పోయి తమపై ఆరోపణలు చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి గత ప్రభుత్వానికి రూ.లక్షల కోట్లు వచ్చాయి కానీ, పేదవాడికి ఇల్లు కట్టించి ఇవ్వడానికి మనసు రాలేదని మండిపడ్డారు.
కింద ప్రాంతం కొట్టుకుపోతుంది..
కాళేశ్వరం ప్రాజెక్టులో నీరు నిల్వ చేస్తే.. కింద ఉన్న ప్రాంతమంతా కొట్టుకుపోతుందని NDSA హెచ్చరించిందని పొంగులేటి తెలిపారు. ప్రాజెక్టు కట్టినప్పుడు చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే ఈ గతి పట్టేది కాదన్నారు. అధికారం కోసం తమ ప్రభుత్వంపై నిందలు వేయడం ఆపాలని, సలహాలు ఇవ్వాలనుకుంటే అసెంబ్లీలో మాట్లాడాలని సూచించారు.
తల తాకట్టు పెట్టయినా..
గుడిసెలు లేని రాష్ట్రమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని పొంగులేటి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అసంపూర్తిగా కట్టి వదిలేశారని ఆరోపించారు. అవసరమైతే ప్రభుత్వం తల తాకట్టు పెట్టయినా పేదవాడి సొంత ఇంటి కలను నెరవేర్చడమే లక్ష్యమని మంత్రి పునరుద్ఘాటించారు.
Read Also: పాలమూరు రైతుల సోలార్ ‘పంట‘.. నెలనెలా ఆదాయం
Follow Us On: Instagram

