కలం, వెబ్ డెస్క్: పాఠశాలలు ప్రారంభమైన కొద్ది రోజులకే ప్రైవేట్ స్కూల్ బస్సు (School Bus)ల ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా కడప (Kadapa)జిల్లాలో ఓ స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. బస్సు ప్రయాణిస్తుండగానే రెండు టైర్లు ఊడి రోడ్డుపై పడిపోయాయి. పులివెందుల మార్కెట్ యార్డ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నారు. స్థానికులు గమనించి బస్సు డ్రైవర్కు కేకలు వేశారు. దీంతో డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపివేశాడు.
ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీంతో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు, రవాణా అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాలల ప్రారంభానికి ముందే బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయించడంలో ఎందుకు నిర్లక్ష్యం వహించారని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. కాగా, ఈ బస్సు ప్రమాదానికి సంబంధించిన వీడియో స్థానిక సీసీ టీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

