కలం, హనుమకొండ: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం భవిష్యత్తులో అభివృద్ధిలో మరింత ముందంజలో నిలుస్తుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. సోమవారం హనుమకొండ (Hanumakonda) జిల్లా ఎల్కతుర్తి జంక్షన్ వద్ద మడిపల్లి నుండి ఎల్కతుర్తి జంక్షన్ వరకు కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రూ. 13 కోట్లతో చేపట్టిన బీటి రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, కుడా వైస్ చైర్పర్సన్, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సంతాజీలతో కలసి సోమవారం శిలాఫలకాన్ని ఆవిష్కరించి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రహదారి నిర్మాణం పూర్తయితే గ్రామాలకు, మండల కేంద్రానికి రహదారి అనుసంధానం పెరుగుతుందని అన్నారు. ఎల్కతుర్తి మండల కేంద్రానికి కోర్టు, విద్యుత్ ఉపకేంద్రం, తహశీల్దార్ కార్యాలయాలు వస్తున్నాయన్నారు. తద్వారా ఎల్కతుర్తి భవిష్యత్తులో మరింత అభివృద్ధిని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రోడ్డు నిర్మాణం కోసం కుడా చైర్మన్ వెంకట్రాంరెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలిపారు.
ఈ రహదారి నిర్మాణం ఈ ప్రాంత ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రహదారి నిర్మాణానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలని కోరారు. రోడ్డు నిర్మాణం కావాలని ప్రజలు ప్రజాప్రతినిధులు, నాయకుల దృష్టికి తీసుకువచ్చారని, దీంతో రహదారి నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. రహదారి అభివృద్ధి పనులు త్వరగా పూర్తి కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి సర్పంచ్ లావణ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ సంతాజీ, ఉప సర్పంచ్ రాజు, హనుమకొండ ఆర్డీవో వెంకటేష్, కుడా సీపీఓ అజిత్ రెడ్డి, ఈఈ భీమ్ రావు, తహశీల్దార్ ప్రసాదరావు, వివిధ గ్రామాల సర్పంచులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

