కలం, వెబ్ డెస్క్ : హామీల గురించి అడిగితే సీఎం అనే విషయాన్ని మరిచిపోయి రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమావేశానికి హాజరై మాట్లాడారు.
బీఆర్ఎస్ పదేళ్ల హయాంలో రూ.4 లక్షల కోట్ల అప్పులు చేసి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని చెప్పుకొచ్చారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లలో రూ. 4 లక్షల కోట్ల అప్పుతో ఏం చేశారో చెప్పాలని తలసాని ప్రశ్నించారు. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆయన (Talasani Srinivas Yadav) ఆరోపించారు.
కేసీఆర్ తన ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడి రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు అని కొనియాడారు. కేసీఆర్ ను తలుచుకోలేకపోతే సీఎం రేవంత్ రెడ్డికి నిద్ర పట్టదని ఎద్దేవా చేశారు. అలాగే, సర్ ప్రక్రియపై కార్యకర్తలకు తలసాని దిశానిర్దేశం చేశారు. 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకునేలా చూడాలని సూచించారు.
ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములగా మారి దొంగ ఓట్లను తొలగించేలా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో సీఎం ఇచ్చిన హామీల అమలుపై పోరాడాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయకుండా మోసం చేసిన విధానంపై ప్రజలకు వివరించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పకుండా సీఎం రేవంత్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

