కలం, వెబ్ డెస్క్: జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) కీలక ప్రకటన చేశారు. పట్నాలోని బంకీపుర్ ఉప ఎన్నికలో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఈ నియోజకవర్గం నుంచే గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే, అధిష్ఠానం బీజేపీ జాతీయ అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. జులై 30వ తేదీన ఉప ఎన్నిక పోలింగ్ జరగనుండగా, ఆగస్ట్ మూడో తేదీన ఫలితాలు వెల్లడించనున్నారు.
ఎన్డీయే పాలనకు రిఫరెండం..
బంకీపుర్ నుంచి ప్రశాంత్ కిషోర్ పోటీ చేయబోతున్నారని జన్ సురాజ్ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఉప ఎన్నిక సమ్రాట్ చౌధరీ ఆధ్వర్యంలోని ఎన్డీయే పాలనకు రిఫరెండం లాంటిదే అని రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్ భర్తి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఓటర్లు ప్రశాంత్ కిషోర్ ను గెలిపించాలని కోరారు. ఒక్క సీటు గెలిచినంత మాత్రాన ఎన్డీయే పాలనలో ఒరిగేదేం లేదని.. ప్రశాంత్ కిషోర్ గెలిస్తే అసెంబ్లీలో ప్రజల తరఫున బలంగా పోరాడుతారని విన్నవించారు.
సునాయసంగా గెలుస్తామని బీజేపీ ధీమా..
బీజేపీ మాత్రం ఈ స్థానాన్ని మరోసారి కైవసం చేసుకుంటామని ధీమాగా చెబుతోంది. 1990 నుంచి వరుసగా బీజేపీ నేతలే ఇక్కడ గెలుస్తూ వస్తున్నారని.. ఉప ఎన్నికలోనూ తమ అభ్యర్థి విజయం సాధిస్తాడని ఘంటాపథంగా చెబుతోంది. ఇండియా కూటమి ఇంకా అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. ఆర్జేడీ నుంచి బహిష్కరణకు గురై జనశక్తి జనతా దళ్ పార్టీ స్థాపించుకున్న తేజ్ ప్రతాప్ యాదవ్ తమ పార్టీ నుంచి సామాజిక కార్యకర్త వీనా మన్వి పోటీ చేస్తారని వెల్లడించారు.

