కలం, యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. వారాంతం (శని, ఆదివారాలు) కావడంతో రాష్ట్ర నలుమూలల నుండి వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనార్థం కొండపైకి చేరుకున్నారు. దీంతో ఆలయ పరిసరాలన్నీ జనసందోహంగా మారాయి. లక్ష్మీనరసింహుని దర్శించుకోడానికి వచ్చిన భక్తులతో ఆలయ మాడ వీధులు పూర్తిగా నిండిపోయాయి.
భక్తుల రద్దీ ఊహించని స్థాయిలో పెరగడంతో ధర్మదర్శనం క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో గంటల కొద్దీ వేచి ఉండాల్సి వస్తోంది. ఆలయ పరిసరాల్లోని ప్రసాద విక్రయశాలలు, కల్యాణకట్ట, పుష్కరిణి ప్రాంతాలు ఎటు చూసినా భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.
కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డులో వాహనాలు భారీగా బారులు తీరాయి. కొండపై ఉన్న పార్కింగ్ స్థలాలు వాహనాలతో నిండిపోవడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తున్నారు. మరోవైపు స్వామివారి వ్రత మండపాలు, విశ్రాంతి గదులు సైతం భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సగటున రోజుకు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.

