కలం, నల్లగొండ: నల్గొండ (Nalgonda) జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, స్విఫ్ట్ కారును బలంగా ఢీకొట్టింది. ఈ భీకర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు పూర్తిగా నుజ్జునుజ్జవడంతో మృతదేహాలు అందులో ఇరుక్కుపోయాయి.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పెద్దకాపర్తి వద్ద జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఆయన స్థానిక సీఐ, ఇతర ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి వివరాలు ఆరా తీశారు. ప్రమాదం ఏ విధంగా జరిగింది, నిర్లక్ష్యం ఎవరిది అనే అంశాలపై సమగ్ర విచారణ జరిపి పూర్తి వివరాలను తనకు అందజేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి, వారికి అత్యంత మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని వైద్య అధికారులను పురమాయించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడం పట్ల మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంతో అక్కడ భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

