కలం, వెబ్డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో మరో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. వీఐపీ ప్రాంతాలే లక్ష్యంగా దాడులకు ప్లాన్ చేస్తున్న పాకిస్తాన్ ఐఎస్ఐ మద్దతుదారులైన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్కు చెందిన షాజాద్ భట్టి నెట్వర్క్తో వీరికి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు వీరిని పంజాబ్, ఢిల్లీలో జరిపిన సీక్రెట్ ఆపరేషన్లలో అదుపులోకి తీసుకున్నారు. సరిహద్దుల గుండా డ్రోన్ల ద్వారా ఆయుధాలు, డ్రగ్స్ సరఫరా చేస్తూ నిరుద్యోగ యువతను చేరదీసి భారత్లో ఉగ్ర కార్యకలాపాలను విస్తరించేందుకు పాక్ హ్యాండ్లర్లు ప్రయత్నిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఈ కుట్రకు సంబంధించి తొలుత అమృత్సర్లో శుభ్దీప్ సింగ్ అనే యువకుడిని అరెస్ట్ చేయగా, అతను ఇచ్చిన సమాచారంతో ఢిల్లీకి చెందిన గుర్జంత్ సింగ్, సాజన్ సింగ్, గగన్ప్రీత్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రెండు విదేశీ పిస్టళ్లు, 9 కార్ట్రిడ్జ్లు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా విదేశీ ఫోన్ నంబర్లు, సోషల్ మీడియా యాప్స్ ద్వారా పాక్ హ్యాండ్లర్లతో టచ్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నిందితుల్లో ఒకరైన గగన్ప్రీత్కు ఢిల్లీలోని పోలీస్ స్టేషన్లు, పికెట్లు, మతపరమైన ప్రదేశాలపై నిఘా పెట్టాడు.
నగరంలో కాల్పుల ఉదంతాలకు పాల్పడాలని పాక్ హ్యాండ్లర్లు బాధ్యతలు అప్పగించినట్లు విచారణలో వెల్లడించారు. గత నెలలోనే ఐఎస్ఐ అండర్ వరల్డ్ ముఠాకు చెందిన ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక తాజాగా ఈ ముఠాను పట్టుకోవడంతో ఢిల్లీ సహా పలు నగరాల్లో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. అయితే రాజధానిలో ఇంకా ఎంత మంది ఉగ్ర మూలాలున్న వ్యక్తులు ఉన్నారన్నది ప్రజల్లో భయాందోళన కలిగిస్తోంది.

