కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లా ముదిగొండ మండల పరిధిలోని బాణాపురం, వల్లభి గ్రామాలలో గురువారం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా బాణాపురం గ్రామంలోని ఎస్సీ కాలనీలో రూ. 1 కోటి అంచనా వ్యయంతో నిర్మించనున్న అంతర్గత సిమెంట్ రహదారుల పనులకు ఆయన భూమిపూజ చేశారు. అలాగే, బాణాపురం నుండి పెదమండవ ఆర్ & బి రోడ్డు వరకు రూ. 30 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న పైప్ కల్వర్ట్, రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మొత్తం రూ. 1.30 కోట్ల అంచనా వ్యయంతో ఈ అభివృద్ధి పనులను ప్రారంభించారు.
ఉపముఖ్యమంత్రి హోదాలో తమ గ్రామానికి విచ్చేసిన భట్టి విక్రమార్కకు వల్లభి, బాణాపురం గ్రామ ప్రజలు, మహిళలు అడుగడుగునా మంగళహారతులు పడుతూ, పూలవర్షం కురిపిస్తూ, బాణాసంచా కాలుస్తూ పండుగ వాతావరణంలో అపూర్వ స్వాగతం పలికారు. గ్రామస్తులు, స్థానిక నాయకులు భారీ ఎత్తున తరలివచ్చి డిప్యూటీ సీఎంకు గజమాలతో ఘనసన్మానం చేశారు. శంకుస్థాపన నిమిత్తం గ్రామ వీధుల్లో నడుచుకుంటూ వెళ్తున్న ఉపముఖ్యమంత్రి వెంట ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంటూ, గ్రామాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.

