కలం, జనగామ : ట్రేడ్ లైసెన్స్ పొందేందుకు ఆన్లైన్లో తప్పుడు వివరాలు నమోదు చేసిన ఓ వ్యాపారిపై పురపాలక శాఖ అధికారులు భారీ జరిమానా విధించారు. జనగామ (Jangaon) పట్టణానికి చెందిన రచ్చ రాజశేఖర్ ట్రేడ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో వ్యాపార సంస్థ విస్తీర్ణాన్ని వాస్తవానికి కంటే తక్కువగా నమోదు చేసి లైసెన్స్ పొందినట్లు మున్సిపల్ సిబ్బంది తనిఖీల్లో గుర్తించారు.
దీంతో నిబంధనల ప్రకారం సంబంధిత వ్యక్తిపై 25 రెట్లు పెనాల్టీ విధించి, మొత్తం రూ.63,250 జరిమానాను వసూలు చేసినట్లు జనగామ పురపాలక సంఘం కమిషనర్ తెలిపారు. ట్రేడ్ లైసెన్స్ దరఖాస్తుల్లో వ్యాపారులు తప్పనిసరిగా వాస్తవ వివరాలనే నమోదు చేయాలని, తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

