కలం, నిర్మల్ బ్యూరో: ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) ఆదివారం బాసరలోని జ్ఞాన సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయ వేద పండితులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఇటీవల చోరీ జరిగిన మహంకాళి అమ్మవారి ఆలయాన్ని మంత్రి జూపల్లి (Jupally Krishna Rao) సందర్శించి ఘటనపై ఆరా తీశారు. ఆలయ భద్రతా ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
అంతకుముందు ఇంద్రప్రస్థ గెస్ట్ హౌస్లో బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులు, టెండర్ల ప్రక్రియ పురోగతిపై కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎస్పీ జానకి షర్మిల, ఆలయ ఈవో అంజనాదేవితో మంత్రి సమీక్ష నిర్వహించారు. టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. మంత్రి వెంట మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్రావు పటేల్, బాసర సర్పంచ్ వెంకటేశ్ గౌడ్ ఉన్నారు.

