కలం, వెబ్ డెస్క్: వారాంతంలో మరోసారి మరోసారి నగరంలో హైడ్రా (HYDRAA) కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. హైడ్రా అధికారులు శనివారం ఉదయం మరోసారి అక్రమ నిర్మాణాలపై ఉక్కు పాదం మోపారు. కూకట్పల్లి (Kukatpally), అల్వాల్ (Alwal) ప్రాంతాల్లో భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. కూటక్పల్లి పరిధిలోని కేపీహెచ్బీ కాలనీ ఎంఆర్ఓ ఆఫీస్ లైన్లో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన పలు అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి హైడ్రా సిబ్బది కూల్చివేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.
మరోవైపు అల్వాల్ పరిధిలోనూ హైడ్రా అధికారులు భారీ ఆపరేషన్ చేపట్టారు. అల్వాల్ హస్మత్పేట్లో సర్వే నెంబర్ 1 లోని సుమారు 108 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల నుంచి కాపాడేందుకు అధికారులు రంగంలోకి దిగారు. అక్కడ ప్రభుత్వ స్థలాల్లో వెలిసిన అక్రమ కట్టడాలను డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బలగాలు , పోలీసుల బందోబస్తు మధ్య నేలమట్టం చేశారు. ఈ 108 ఎకరాల ప్రభుత్వ భూమిలో మిగిలిన చివరి 10 ఎకరాలను హైడ్రా కాపాడింది.
సుమారు రూ.750 కోట్ల విలువైన ఈ భూమిలో ఇప్పటికే 98 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు అధికారులు గుర్తించారు. రెవెన్యూ శాఖ విజ్ఞప్తి మేరకు చర్యలు చేపట్టిన హైడ్రా, ఖాళీగా ఉన్న మిగిలిన భూమిపై నిర్మించిన అక్రమ ప్రీకాస్ట్ గోడలు, తాత్కాలిక షెడ్లను కూల్చివేసింది. అయితే అక్కడ ఉన్న నివాస గృహాలను మాత్రం యథాతథంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఎంతటి వారినైనా వదిలేది లేదని అధికారులు హెచ్చరిస్తున్నారు.

