కలం, వెబ్ డెస్క్ : మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ పైన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శుక్రవారం ఎంసీఆర్హెచ్ఆర్డి బోధి పెవిలియన్ లో జరిగిన సమావేశంలో మూసీ మొదటి దశ ప్రాజెక్ట్ పైన చర్చించిన సీఎం అధికారుకలకు కీలక సూచనలు చేశారు.
ముసీ నది రివర్ బెడ్ లో ఉన్న వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని సూచించారు. భూ సేకరణ కోసం ఆసక్తి ఉన్న వాళ్లకు టీడీఆర్ ఇవ్వాలి లేదా పరిహారం చెల్లించాలని సీఎం (CM Revanth Reddy) స్పష్టం చేశారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం తీసుకుంటున్న డిఫెన్స్ భూముల్లో ఉన్న నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వమే తరలించాలని ఆదేశించారు.
ప్రజల సందర్శన కోసం నెక్లెస్ రోడ్ లో మూసీ ఎక్స్పీరియన్స్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. మూసీ ప్రాజెక్ట్ లో చేపట్టబోయే పనులు ఈ సెంటర్ లో ప్రతిబింబించాలని స్పష్టం చేశారు. ప్రాజెక్ట్ పైన ప్రజల అభిప్రాయాలను తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.
ఈ సమావేశానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఎండీ నర్సింహారెడ్డి, ఎంఆర్డీసీఎల్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్, సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, మునిసిపల్ శాఖ ఉన్నతాధికారులు, తదితరులు హాజరయ్యారు.

