కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరు అద్భుతంగా ఉందని మేఘాలయ సీఎం (Meghalaya CM) కాన్రాడ్ కె.సంగ్మా ప్రశంసించారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఆయన కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించారు. సెంటర్ పనితీరు, అందులోని విభాగాలు, టెక్నాలజీని ఉపయోగిస్తున్న తీరు, సీసీ కెమెరాలను అనుసంధానించి రాష్ట్రమంతా ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తున్న తీరు చూసి అబ్బురపడ్డారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. దేశంలోనే ఇదే అత్యుత్తమ కమాండ్ కంట్రోల్ సెంటర్ అని, ఇక్కడ విభాగాల మధ్య సమన్వయం చాలా బాగుందన్నారు. దీన్ని మిగతా రాష్ట్రాలు కూడా అనుసరించాల్సిన అవసరం ఉందని.. తాను కూడా మేఘాలయలో ఈ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తానని వెల్లడించారు. అంతకుముందు, కమాండ్ కంట్రోల్ సెంటర్కి వచ్చిన ముఖ్యమంత్రి సంగ్మాకు డీసీపీలు స్వాగతం పలికారు.

