కలం, భూపాలపల్లి: భూపాలపల్లి (Bhupalpally) జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల మండలం తిర్మలాపురం(Tirumalapur) గ్రామానికి చెందిన బీరన్న–మౌనిక దంపతులకు రెండేళ్ల కుమార్తె ఉంది. గురువారం ఇంటి వద్ద ఆడుకుంటూ బయటకు వెళ్లిన చిన్నారి, ఇంటి ముందు ఉన్న నీటి సంపులో ప్రమాదవశాత్తు పడి మృతి చెందింది. సంపులోకి తొంగి చూసే ప్రయత్నంలో కాలుజారి అందులో పడిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించగా, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

