కలం, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో పాటు తెలంగాణ నుంచి మన్నార్ వరకు ద్రోణి విస్తరించి ఉండటంతో విస్తారంగా వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. రానున్న గంటల్లో ఉత్తరాంధ్ర సహా ఏపీలోని 11 జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ అయింది. అలాగే పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు వానలు పడే అవకాశం ఉండగా, రాయలసీమ పరిధిలోని కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
మరోవైపు తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో గురువారం పలుచోట్ల కుండపోత వర్షం (Heavy Rains) ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాలు జలమయమవడంతో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. నగరంలోని చందానగర్, రామచంద్రపురం పరిసర ప్రాంతాల్లో అత్యధికంగా 12.7 సెంటీమీటర్ల వర్షం పడగా, లింగంపల్లిలో 12 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. వీటితో పాటు ఐటీ కారిడార్ పరిధిలోని గచ్చిబౌలిలో 10 సెంటీమీటర్లు, శివరాంపల్లిలో 10.1 సెంటీమీటర్లు, పటాన్చెరులో 7.6 సెంటీమీటర్లు, రాజేంద్రనగర్లో 6.5 సెంటీమీటర్ల చొప్పున భారీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ అకాల వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read Also: రమ్మంటున్న కేటీఆర్.. రానంటున్న కేసీఆర్!
Follow Us On : WhatsApp

