కలం, వెబ్ డెస్క్: విశాఖపట్నం (Visakhapatnam)లో మరో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అనకాపల్లి జిల్లాలోని పరవాడ ఫార్మా సిటీలోని దక్షిణ్ ఎనర్జీ కంపెనీలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు సజీవ దహనమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో మరో ఇద్దరు కూడా మరణించినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అకాశం ఉంది. మృతులను అచ్యుతాపురానికి చెందిన వేపాడ వెంకటేష్, త్రినాథ్లుగా గుర్తించారు.
ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో సుమారు 30 మంది పని చేస్తున్నట్లు సమాచారం. వీరిలో ఎంతమంది ప్రమాదం నుంచి తప్పించుకున్నారు, ఎంత మంది అందులోనే చిక్కుకుపోయారన్నది తెలియాల్సి ఉంది. పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. కాగా, తరచూ విశాఖలోని పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలు జరుగుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కంపెనీ యాజమాన్యాలు నియమ నిబంధనలు పాటించడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

