కలం, వెబ్ డెస్క్: నిత్యం బాలికలపై ఎక్కడో ఒకచోట లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. మోసగాళ్లు బాలికలను ఏదో ఒక విధంగా ట్రాప్ చేస్తూనే ఉన్నారు. తాజాగా మహారాష్ట్ర (Maharashtra)లో దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. 19 ఏళ్ల యువకుడు మహమ్మద్ అయాజ్ అలియాస్ తన్వీర్.. ప్రేమ పేరుతో 180 మంది బాలికలను ట్రాప్ (Love Scam) చేసి వ్యభిచార కూపంలోకి నెట్టిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. నిన్ను ప్రేమిస్తున్నానని, జీవితాంతం నీతోనే ఉంటానని, నిన్ను పెళ్లి చేసుకుంటానని అమ్మాయిలకు మాయమాటలు చెప్పి, ప్రలోభాలకు గురి చేసి ఆ దుర్మార్గుడు ట్రాప్ చేశాడు. ఆ మాటలు నమ్మిన బాలికలు.. అతడితో వచ్చేయడంతో వారిని ముంబయి, పూణేలకు తీసుకెళ్లి లైగింక వేధింపులకు చేశాడు. అంతేకాదు 350కి పైగా అశ్లీల వీడియోలు చిత్రీకరించి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డాడు.
దీంతో ఏం చేయాలో తెలియక తీవ్ర నరకాన్ని అనుభవిస్తున్న బాలికలు.. తమ తల్లిదండ్రులకు చెప్పుకున్నారు. ఈ విషయాన్ని కొందరు బాధిత బాలికల తల్లిదండ్రులు నేరుగా రాజ్యసభ ఎంపీ అనిల్ బోండే వద్దకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. తమ పిల్లలను కాపాడాలని వీరు ఎంపీకి లేఖ రాశారు. విషయం తెలుసుకున్న ఎంపీ.. తక్షణమే చర్యలు తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడు మహమ్మద్ అయాజ్, పరాత్వడ నగరానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అతడి వద్ద నుంచి వీడియోలను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

