కలం, వెబ్ డెస్క్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏడుగురు ఎంపీలు (YSRCP MPs) నేడు ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan)ను కలిశారు. రాజ్యసభలో అమరావతి బిల్లు (Amaravati Bill) చర్చలో తమ పార్టీ ఎంపీలకు సరైన సమయం కేటాయించలేదని పేర్కొంటూ ఉప రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో వైసీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, గురుమూర్తి, అయోధ్య రామిరెడ్డి, బాబూరావు ఉన్నారు.
ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) మీడియాతో మాట్లాడుతూ రాజ్యసభలో తమ పార్టీ సభ్యులపై వివక్ష చూపించారని ఆరోపించారు. తనతో పాటు తమ పార్టీ ఎంపీలందరి (YSRCP MPs) గొంతు నొక్కే ప్రయత్నం చేశారన్నారు. ఏడుగురు సభ్యులున్న వైసీపీ సభ్యులకు ఐదు నిమిషాలు సమయం ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు.
నిబంధనల ప్రకారం ప్రతి బిల్లుపై చర్చకు కనీసం 20 నిమిషాలు సమయం ఇస్తారని తెలిపారు. కానీ, తాను ఐదు నిమిషాలు మాట్లాడిన తర్వాత టైం అయిపోయిందని మైక్ కట్ చేశారని, ఇది చాలా దుర్మార్గం అని అన్నారు. కొందరి ప్రోద్బలంతోనే ఇలా వ్యవహరించారని తమకు అనుమానాలు ఉన్నాయని, దీనిపై వివరంగా ఫిర్యాదు చేశామని చెప్పారు. వైసీపీ కంటే చిన్న పార్టీలైన బీఆర్ఎస్, టీడీపీలు మాట్లాడేందుకు ఎక్కువ సమయం కేటాయించడంపై వివరాలు సమర్పించినట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులకు 20 నిమిషాలు, ఇద్దరు సభ్యులున్న టీడీపీకి 20 నిమిషాలు కేటాయించారని చెప్పారు. దేశం దృష్టిలో వైసీపీ అమరావతికి వ్యతిరేకం అని దుష్ప్రచారం చేసేందుకు రాజ్యసభను (Rajya Sabha) వేదికగా వాడుకున్నారని ఆరోపించారు.
Read Also: అలర్ట్.. ఈ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక!
Follow Us On : WhatsApp

