కలం, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుంటే… మరోవైపు అక్కడక్కడ వర్షాలు సైతం కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ రాష్ట్ర ప్రజలకు అలర్ట్ జారీ చేసింది. రాగల 3 గంటల్లో పిడుగులతో (Thunderstorm) కూడిన వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక జారీ చేసింది. రాగల మూడు గంటల్లో అల్లూరి, పోలవరం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇదే సమయంలో 40-60కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
మరోవైపు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దాని పరిసర ప్రాంతాలపై ఒక ఉపరితల ఆవర్తనము సగటు సముద్ర మట్టానికి 1.5 నుండి 3.1 కిలోమీటర్ల మధ్య ఎత్తులో విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావం వలన ఏపీలోని పలు జిల్లాల్లో వర్షం కురవనుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం, ఆదివారం మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అయితే గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదని తెలిపింది.

