కలం, వెబ్ డెస్క్ : ప్రశ్నించిన వారిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ (MLC Botcha Satyanarayana) అన్నారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల బాగోగులను చూడాల్సిన ప్రభుత్వం ప్రశ్నించే వారిపై కక్ష సాధింపులకు దిగుతోందన్నారు.
యూట్యూబర్ ప్రశ్న రావణ్, కేవీ రెడ్డిలను అరెస్ట్ చేయడం ప్రశ్నించే గొంతును అణచడానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలు పట్టించుకోవాలని బొత్స హితవు పలికారు. పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదని, రైతులకు అవసరమైన యూరియా కూడా అందుబాటులో ఉండడం లేదని ఆయన (MLC Botcha) ఆరోపించారు.
రైతుల సమస్యలు సీఎం చంద్రబాబుకు పట్టడం లేదని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపనలు చేసిన పనులకే కూటమి సర్కార్ శంకుస్థాపనలు చేస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడిచినా ఒక్క అభివృద్ధి కార్యక్రమం అయినా చేపట్టారా? అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.

