కలం, వెబ్ డెస్క్ : వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి (Byreddy Siddharth Reddy)పై కర్నూలు త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తనతో పాటు తన కుటుంబ సభ్యులపై కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అవమానకరమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి, కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ గుప్తా పోలీసులను ఆశ్రయించారు. మంత్రి ఫిర్యాదు మేరకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు కర్నూలు త్రీ టౌన్ సీఐ శేషయ్య తెలిపారు.
కాగా, ఇటీవల కర్నూలు కలెక్టరేట్ వద్ద వైసీపీ నేతలు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మంత్రిని ఉద్దేశించి తీవ్ర ఆరోపణలు చేశారు. ఓ ఫార్మా కంపెనీ నుంచి మంత్రి టీజీ భరత్ రూ.45 కోట్లు లంచం తీసుకున్నారని బహిరంగంగా ఆరోపించారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి భరత్.. బైరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే అతనిపై పరువు నష్టం దావా కూడా వేస్తానని హెచ్చరించారు.

