సీబీఐ కోర్టుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(YS Jagan) లేఖ రాశారు. అక్రమాస్తుల కేసులో కోర్టు ముందు హాజరవడానికి తనకు మరింత సమయం ఇవ్వాలని ఆయన తన లేఖలో కోరారు. తొలుత తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ లేఖరాశారు. కాగా ఎందుకో ఆయన తన లేఖను ఉపసంహరించుకుని.. తాజాగా తనకు మరింత సమయం ఇవ్వాలని మరో లేఖ రాశారు. తాను యూరప్ పర్యటనకు వెళ్తున్నానని, అది ముగించుకున్న తర్వాత కోర్టు ముందు హాజరవుతానని, అందుకు గానూ తనకు కాస్తంత సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. ఆయన అభ్యర్థనకు ఓకే చెప్పిన న్యాయస్థానం.. నవంబర్ 14న హాజరుకవాలని వెల్లడించింది.
అక్టోబర్లో యూరప్ పర్యటనకు వెళ్లేందుకు జగన్కు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే, పర్యటన ముగించుకుని తిరిగి వచ్చాక నవంబర్ 14న కచ్చితంగా వ్యక్తిగతంగా హాజరుకావాలని షరతు విధించింది. ఈ గడువు సమీపిస్తున్న వేళ, ఈ నెల 6న వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఆయన మెమో దాఖలు చేశారు. మంగళవారం ఈ మెమోపై సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి డాక్టర్ టి.రఘురాం విచారణ చేపట్టారు. జగన్కు మినహాయింపు ఇవ్వడాన్ని ఈ సందర్భంగా సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. బెయిల్ షరతుల ప్రకారం ప్రతి విచారణకు ఆయన హాజరుకావాల్సిందేనని తేల్చి చెప్పింది.
దీనిపై జగన్(YS Jagan) తరఫు న్యాయవాది జి. అశోక్రెడ్డి వాదనలు వినిపిస్తూ… హైకోర్టు గతంలోనే ఆయనకు హాజరు నుంచి మినహాయింపు ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయడం అధికార యంత్రాంగానికి ఇబ్బందికరమనే ఉద్దేశంతోనే మినహాయింపు కోరామని, అంతేకానీ కోర్టుకు హాజరయ్యేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వివరించారు. అనంతరం, తాము ఈ నెల 21వ తేదీలోగా కోర్టు ముందు హాజరవుతామని పేర్కొంటూ కొత్త మెమో దాఖలు చేస్తున్నట్లు న్యాయవాది తెలిపారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి, గతంలో దాఖలు చేసిన మినహాయింపు మెమోను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Read Also: పేలుడు బాధితులకు ప్రధాని పరామర్శ
Follow Us on : Pinterest

