కలం, వెబ్ డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) సూచించారు. ఏ నియోజకవర్గంలో కూడా ఏకగ్రీవాలు జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అలా జరిగితే మాత్రం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వబోమని వార్నింగ్ ఇచ్చారు. అధికార పార్టీ ఎన్ని ఒత్తిళ్లు పెట్టినా, ఎంతగా ప్రలోభ పెట్టినా.. పోటీ చేసే పార్టీ కార్యకర్తలు, నాయకులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. వారి కోసం ఇప్పుడు నిలబడితేనే.. రేపటి ఎన్నికల్లో మనం కోసం నిలబడుతారని స్పష్టం చేశారు. నాయకుడు తనతో ఉన్నాడనే భరోసా వారిలో కలగాలని పేర్కొన్నారు. అవసరమైతే నాయకుడు కుటుంబ సభ్యులు కూడా ప్రచారంలోకి వెళ్లాలని కూడా సూచించారు.
ప్రతి చోట పోటీ పడాలి..
చంద్రబాబు ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్ఫక్షపాతంగా జరగనివ్వరని జగన్ విమర్శించారు. ఇవి కేవలం గెలుపోటములకు సంబంధించిన విషయం కాదని, ఎవరూ ఎంత బలంగా నిలబడుతారనేది అసలైన ప్రశ్న అన్నారు. ప్రతి స్థానంలో వైసీపీ అభ్యర్థి పోటీ పడాల్సిందే అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న కూడా వైసీపీని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లినట్లు తెలిపారు. మొదటి సారిగా గ్రామ స్థాయిలో అనుబంధ కమిటీలు కూడా వేశామన్నారు. రాష్ట్ర చరిత్రలో వైసీపీ ప్రభుత్వంలా మేనిఫెస్టోలో పెట్టిన 99 శాతం హామీలను అమలు చేయలేదన్నారు.

