కలం, వెబ్డెస్క్: కొలంబో టెస్టులో మరో ఆటగాడిపై ఐసీసీ చర్యలు తీసుకుంది. శ్రీలంక స్పిన్నర్ ప్రబాత్ జయసూర్య (Prabath Jayasuriya)కు అధికారిక మందలింపుతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ ఇచ్చింది. రెండో రోజు ఆట ముగిసే సమయంలో ఈ ఘటన జరిగింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో జయసూర్యను భారత స్పిన్నర్ మానవ్ సుతార్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. పెవిలియన్కు వెళ్తున్న సమయంలో జయసూర్య తన బ్యాట్తో బౌండరీ వద్ద ఉన్న వికెట్ బౌండరీ మార్కర్లను కొట్టాడు.
దీనిని ఐసీసీ నిబంధనల ఉల్లంఘనగా గుర్తించింది. అంతర్జాతీయ మ్యాచ్లో క్రికెట్ పరికరాలు లేదా మైదానంలోని వస్తువులను దుర్వినియోగం చేయడంపై ఉన్న నిబంధన కింద చర్యలు తీసుకుంది. జయసూర్య తన తప్పును అంగీకరించాడు. ఐసీసీ ప్రతిపాదించిన శిక్షను కూడా అంగీకరించడంతో ప్రత్యేక విచారణ అవసరం లేకపోయింది. ఇది గత 24 నెలల్లో జయసూర్య చేసిన తొలి నేరంగా ఐసీసీ పేర్కొంది.
ఈ టెస్టులో ఇప్పటికే యశస్వి జైస్వాల్, అసిత ఫెర్నాండోపై కూడా చర్యలు తీసుకున్నారు. తొలి రోజు ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదంలో శారీరకంగా తాకడం జరిగింది. దీంతో జైస్వాల్, ఫెర్నాండోకు మ్యాచ్ ఫీజులో 25 శాతం చొప్పున జరిమానా విధించారు. ఒక్కొక్కరికి ఒక డీమెరిట్ పాయింట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు జయసూర్య కూడా శిక్షకు గురికావడంతో కొలంబో టెస్టులో ఐసీసీ చర్యలు ఎదుర్కొన్న ఆటగాళ్ల సంఖ్య మూడుకు చేరింది.

