కలం, వెబ్ డెస్క్: తమ పార్టీ ముఖ్య నేతలతో వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) బుధవారం కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కర్తలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. చంద్రబాబు రెండేళ్ల పాలనా వైఫల్యాలు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ సన్నద్ధం అవడం, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR), పార్టీ కమిటీల నిర్మాణం తదితర కీలక అంశాలపై సమావేశంలో చర్చిస్తారు.
అలాగే రాష్ట్రంలోని ప్రజా సమస్యలు, సమకాలీన రాజకీయ పరిణామాలపై పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ బలోపేతం, ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లే కార్యాచరణ రూపొందించే అంశాలపై చర్చించనున్నారు. కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టే అంశాలపై కూడా సమావేశంలో సమగ్ర చర్చ జరుగుతుంది. ప్రజా సమస్యలపై పోరాటాలకు పార్టీని సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది.

