కలం, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Trump) సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ దేశం పూర్తిగా లొంగిపోయినా సరే, ప్రధాన మీడియా సంస్థలు దానిని అమెరికాపై సాధించిన అద్భుత విజయంగా చిత్రీకరిస్తాయని ఆయన విమర్శించారు. ట్రూత్ సోషల్ వేదికగా స్పందించిన ట్రంప్, ఫేక్ న్యూస్ మీడియా తీరును తప్పుపట్టారు. ఇరాన్ తన సైన్యాన్ని ఉపసంహరించుకుని, లొంగుబాటు పత్రాలపై సంతకాలు చేసినా కూడా మీడియా అమెరికాను తక్కువ చేసి చూపిస్తుందని ధ్వజమెత్తారు.
మరోవైపు ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం మరింత సంక్లిష్టంగా మారింది. వివాదాస్పద హార్ముజ్ జలసంధి సమీపంలోని లక్ష్యాలపై అమెరికా దాడులు చేసిందని ఇరాన్ ఆరోపించింది. ఈ దాడుల ద్వారా అమెరికా కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్పష్టంగా ఉల్లంఘించిందని పేర్కొంది. ఈ తాజా పరిణామాలు యుద్ధాన్ని ముగించడానికి జరుగుతున్న శాంతి ప్రయత్నాలకు తీవ్ర ఆటంకంగా మారాయి.

