కలం, వెబ్ డెస్క్ : తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మహానాడు (TDP Mahanadu) నేటి నుంచి రెండు రోజుల పాటు అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది. ఈ ఏడాది మహానాడును సరికొత్త సాంకేతికతతో హైబ్రీడ్ మోడ్లో నిర్వహిస్తున్నారు. పార్టీ శ్రేణులను ఒకేతాటిపైకి తెచ్చేందుకు వీలుగా 1,848 క్లస్టర్లలో భారీ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. కార్యకర్తలు, నేతలు తమ తమ క్లస్టర్ల వారీగానే ఈ వేడుకల్లో ప్రత్యక్షంగా పాలుపంచుకోనున్నారు.
ఈ సారి మహానాడులో స్త్రీ శక్తిని చాటిచెప్పేలా ప్రత్యేక ప్రాధాన్యత కల్పించారు. రాబోయే 2029 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు ఒక పక్కా రోడ్ మ్యాప్ను ఈ వేడుకల్లో ఖరారు చేయనున్నారు. పార్టీ అధినేత సీఎం నారా చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు భవిష్యత్ కార్యాచరణపై స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నారు. ఈ రెండు రోజుల వేడుకల్లో మొత్తం 20 తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 10, తెలంగాణ నుంచి 4, అండమాన్ నుంచి ఒక తీర్మానం ఉండనున్నాయి. వీటితో పాటు నాలుగు ఉమ్మడి తీర్మానాలు, ఒక కీలక రాజకీయ తీర్మానాన్ని ఆమోదించనున్నారు.

