కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) ధ్వజమెత్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగుతోందని విమర్శించారు. ఐదేళ్ల వైసీపీ సంక్షేమ పాలనకు, ప్రస్తుత కూటమి ప్రభుత్వ రెండేళ్ల మార్కు పాలనకు మధ్య వ్యత్యాసాన్ని ప్రజలు ఇప్పటికే బేరీజు వేసుకుంటున్నారని అన్నారు. జగన్ను (YS Jagan) ఎందుకు వదులుకున్నామా? అని ప్రతిఒక్కరూ ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల జీవితాల్లో నిజమైన మార్పులు రావాలనే ఉద్దేశంతోనే తాము పనిచేశామన్నారు. తన మరణం తర్వాత కూడా ప్రతి ఇంట్లో తన ఫొటో శాశ్వతంగా ఉండిపోయేలా సంక్షేమ పథకాలను అందించామని జగన్ గుర్తుచేశారు.
కళ్లు మూసి తెరిచేలోగా రెండేళ్లు గడిచిపోయాయని, ఈ ప్రభుత్వానికి ఇంకా కేవలం మూడేళ్ల కాలం మాత్రమే మిగిలి ఉందని జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. ప్రజల కళ్ల ముందే జరుగుతున్న దౌర్జన్యపూరిత పాలనకు త్వరలోనే ముగింపు పడుతుందన్నారు. ఏపీలో రాబోయేది మళ్లీ వైసీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. మరో ఏడాదిన్నర తర్వాత తాను పాదయాత్ర ప్రారంభించబోతున్నట్లు జగన్ ప్రకటించారు.

