కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ వేర్పాటువాదంగా వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ పై దేశద్రోహం కేసు పెట్టాలని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు తలకాయ లేని పవన్ కళ్యాణ్ మాటలను కాంగ్రెస్ పట్టించుకోకపోవడంలో ఆంతర్యమేముంది? అని చెప్పారు. ఉద్యమకారులను ఉగ్రవాదులంటే కేసులు పెట్టరా? అని ప్రశ్నించారు. కరీంనగర్ గడ్డ తెలంగాణ ఉద్యమాల అడ్డా అని.. అలాంటి కరీంనగర్ లో తెలంగాణ తల్లి విగ్రహం లేకపోవడం తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలను అవమానపర్చడమేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ విధానం ప్రజల పక్షాన లేదని.. తెలంగాణలో సామాజిక న్యాయం కోరుకుంటున్నామని చెప్పారు. సెక్రటేరియట్ లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుమని ఎవరు అడిగారు? అని ప్రశ్నించారు.
మహనీయులైన ప్రొఫెసర్ జయశంకర్, జ్యోతిబాపూలే విగ్రహం పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఉద్యమ ఆనవాళ్లను చెరిపేయడం అలవాటుగా మారిందని కవిత దుయ్యబట్టారు మనవాళ్లు ఇలా చేస్తే స్థానికేతరులు వచ్చి ఉద్యమ అస్తిత్వంపై మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాలకు గద్దర్ అవార్డులకు సంబంధమేముంది? అని ప్రశ్నించారు. పేరుకు గద్దర్ అవార్డులంటారు అని.. రవీంద్రభారతి వద్ద ఎస్పీ బాలు విగ్రహం పెట్టి గద్దర్ పేరు మీద సినిమా అవార్డులంటారని దుయ్యబట్టారు.ఎస్పీ బాలు విగ్రహాన్ని సినిమా స్టూడియాల్లో పెట్టుకుంటే అభ్యంతరం లేదని చెప్పారు. గద్దర్ పేరుతో జానపద అకాడమీ పెట్టి సాంస్కతిక కళాకారులకు ఉద్యోగాలివ్వాలన్నారు.

