కలం, వెబ్ డెస్క్ : విశాఖపట్నంలోని విశాఖ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) ప్రమాదంపై మాజీ సీఎం, వైసీపీ చీఫ్ వైఎస్.జగన్ (YS Jagan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో కార్మికులు మరణించడం అత్యంత విషాదకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి జగన్ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను కోరారు. పేలుడుకు గల కారణాలపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జగన్ డిమాండ్ చేశారు.
పారిశ్రామిక సంస్థల్లో కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. భద్రతా ప్రమాణాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జగన్ (YS Jagan) సూచించారు. ప్రమాద బాధితులు, వారి కుటుంబాలకు అన్ని విధాలా అండగా నిలవాలని విశాఖ జిల్లా, ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులకు జగన్ ఆదేశించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించడంతో పాటు క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందేలా పర్యవేక్షించాలని పార్టీ శ్రేణులకు జగన్ సూచించారు.
Read Also: గోదావరి పరిశుభ్రతపై రాజీ పడే ప్రసక్తే లేదు : పవన్ కల్యాణ్
Follow Us On: Instagram

