కలం, వెబ్ డెస్క్: కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో పెద్ద స్కాం జరిగిందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్.జగన్ (YS Jagan) విమర్శలు గుప్పించారు. తమ హయాంంలో ఇచ్చిన డీఎస్సీని రద్దు చేసి, కొత్తగా మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి.. అందులో స్కాం చేశారని ఆరోపించారు. పేపర్లు లీక్, డేటా డిలీట్, మెరిట్ లిస్టు మాయం కావడంపై చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మంత్రి లోకేశ్ శాఖలో ‘‘డార్క్ ఆపరేషన్’’ సాగిందని.. దీన్ని బయటపెట్టకుండా ప్రభుత్వం దాచి పెడుతోందన్నారు.
‘అతడికి ఎలా ఫస్ట్ ర్యాంక్..?’
డీఎస్సీలో మొదటి ర్యాంక్ వచ్చిన వ్యక్తి SCERTలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అని జగన్ ఆరోపించారు. అతడు పరీక్ష నిర్వహణలో చురుగ్గా పాల్గొన్నాడని.. ఎలా మొదటి ర్యాంక్ వచ్చిందని ప్రశ్నించారు. ఈ విషయం బయటకు పొక్కేసరికి, ఆ వివరాలను డేటాబేస్ నుంచి డిలీట్ చేశారని.. మెరిట్ లిస్టులను దాచారని మండిపడ్డారు. అసలు సెలెక్ట్డ్ అయినవారి వివరాలు ఎందుకు బయటపెట్టలేదని, అభ్యర్థులకు నేరుగా మెసేజ్లు పంపుతున్నారని మండిపడ్డారు. నిబంధనల ప్రకారం ఎంపికైనవారి జాబితాను కలెక్టర్ కార్యాలయాల్లో కూడా పెట్టలేదన్నారు.
‘రూ.15 లక్షలకు అమ్ముకుంటున్నారు?’
స్పోర్ట్స్ కోటా పోస్టుల్లో ఒక్కోటి రూ.15 లక్షలకు అమ్ముకుంటున్నారని జగన్ ఆరోపించారు. దీని వెనుక టీడీపీ నాయకుడే ఉన్నాడని.. ఎప్పుడూ క్రీడా మైదానంలో అడుగు పెట్టని వాళ్లకి కూడా ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చారని ఆరోపించారు. అసలు డీఎస్సీ రిక్రూట్మెంటా?.. లేక వేలం పాటనా.. అని ప్రశ్నించారు. టెట్ కన్వీనర్గా ఉన్న అధికారే డీఎస్సీ పరీక్షకూ కన్వీనర్ అయినప్పటికీ, ఉన్నఫళంగా టెట్ కన్వీనర్ను తొలగించి విద్యా శాఖలోని జాయింట్ డైరెక్టర్ను ఎందుకు పెట్టారన్నారు. దీనికి బాధ్యత వహిస్తూ లోకేష్ను పదవి నుంచి తప్పించి, వెంటనే సీబీఐతో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.

