కలం, వెబ్డెస్క్: ఏపీలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని, సీఎం చంద్రబాబు పోలీసులను తన ఏజెంట్లుగా వాడుకుంటున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) ఆరోపించారు. ప్రభుత్వంపై వ్యతిరేకతను అణచివేయడానికి, ప్రశ్నించే గొంతులను అణగదొక్కడానికి పోలీసు యంత్రాంగాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటున్నారని విమర్శించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 కల్పించిన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అణచివేస్తూ కూటమి ప్రభుత్వం నిరంకుశత్వంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్న వైసీపీ కార్యకర్తలు, జర్నలిస్టులు, సామాన్య పౌరులపై అక్రమ కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికలకు నోటీసులు ఇచ్చి ఖాతాలను బ్యాన్ చేయిస్తున్నారన్నారు. కోర్టులు తప్పు పడుతున్నా ఏకపక్షంగా ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. అదే సమయంలో టీడీపీ సోషల్ మీడియా వేదికగా వైసీపీ నాయకులపై విష ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఆ దుష్ప్రచారాలపై ఫిర్యాదు చేసినా కనీసం పోలీసులు కేసులు నమోదు చేయడం లేదన్నారు. విమర్శలను నేరంగా పరిగణిస్తే ప్రజాస్వామ్యం మనుగడ కష్టమని జగన్ అభిప్రాయపడ్డారు. రాజకీయ కక్ష సాధింపులు, అణచివేత ధోరణి ఆపాలని, విపక్షాల గొంతు నొక్కే ప్రయత్నాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని జగన్ డిమాండ్ చేశారు.

