కలం, వెబ్డెస్క్: హైడ్రా ఉద్యోగాల (HYDRAA Jobs) కోసం నిరుద్యోగులు క్యూ కట్టారు. భారీ ఎత్తున తరలివచ్చిన నిరుద్యోగులతో సరూర్నగర్ స్టేడియం వద్ద తోపులాట జరిగింది. తాజాగా హైడ్రా పదో తరగతి అర్హతతో 150 ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. ఇందులో డీఆర్ఎఫ్ అసిస్టెంట్లు 100, హెవీ వెహికల్ డ్రైవర్లు 50 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాల కోసం సరూర్నగర్ స్టేడియంలో ఆగస్టు 8, 9 తేదీల్లో ఉదయం 5 గంటలకు ఈవెంట్స్ ఉంటాయని ప్రకటనలో పేర్కొంది. ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఐడీ ప్రూఫ్, ఫొటోలతో హాజరు కావాలని హైడ్రా సూచించింది.
ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు. 170 సెకన్లలో 800 మీటర్ల రన్నింగ్, 15 సెకన్లలో 100 మీటర్లు రన్నింగ్, లాంగ్ జంప్ 4 మీటర్లు, 6 మీటర్ల షాట్పుట్ (7.2 KG) ఈవెంట్లలో క్వాలిఫై అవ్వాలని సూచించింది. ఈ ప్రకటన సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారింది. దీంతో సరూర్నగర్ స్టేడియంలో జరిగే ఈవెంట్స్లో పాల్గొనేందుకు నిరుద్యోగులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఉదయం 5 గంటలకే గేటు బయట నిరుద్యోగుల రద్దీతో పరిస్థితి అదుపుతప్పింది. అందరినీ కంట్రోల్ చేయలేక పోలీసులు ఇబ్బందిపడ్డారు.

