కలం, వెబ్ డెస్క్: ప్రజలు అత్యధికంగా వాడే యూట్యూబ్ (YouTube) సేవలకు అంతరాయం కలగడం తీవ్ర కలకలం రేపింది. మంగళవారం రాత్రి నుంచి పలు దేశాల్లో లక్షలాది మంది యూట్యూబ్ యూజర్లు వీడియో స్ట్రీమింగ్ కోసం సమస్యలు ఎదుర్కొన్నట్లు తెలిపారు. యూట్యూబ్ సేవల్లో అంతరాయంపై 2.83 లక్షలకు పైగా ఫిర్యాదులు నమోదైనట్లు సమాచారం. యూట్యూబ్ యాప్ సరిగా పని చేయడం లేదని ఎక్కువ మంది వినియోగదారులు తెలిపారు. కొద్దిసేపు యూట్యూబ్ హోమ్పేజ్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే ఎర్రర్ మెసేజ్ కనిపించిందని వెల్లడించారు. అయితే ఇప్పటికే సేవ్ చేసిన లేదా ఇటీవల చూసిన వీడియోలు మాత్రం ప్లే అవుతున్నట్లు తెలిపారు. ఈ సమస్యపై యూట్యూబ్ సంస్థ ఎక్స్ వేదికగా స్పందిస్తూ ప్రస్తుతం యూట్యూబ్ యాక్సెస్ చేయడంలో ఉన్న సమస్యను పరిశీలిస్తున్నామని, త్వరలో అప్డేట్ ఇస్తామని పేర్కొంది. యూట్యూబ్ సమస్యపై సంస్థ నుంచి మరిన్ని వివరాలు రావాల్సి ఉంది.


