కలం, కరీంనగర్ బ్యూరో: స్మార్ట్ఫోన్ వ్యామోహం మరో ప్రాణాన్ని బలితీసుకుంది. మొబైల్ కొనివ్వలేదనే చిన్న కారణంతో ఒక యువకుడు బలవన్మరణానికి పాల్పడిన విషాదకర ఘటన కరీంనగర్ (Karimnagar) జిల్లా చొప్పదండిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే… మొబైల్ ఫోన్ల పిచ్చి యువతను ఎంతలా పతనం చేస్తుందో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ. పోలీసుల కథనం ప్రకారం.. బీహార్ రాష్ట్రానికి చెందిన నితీష్ కుమార్ అనే యువకుడి సోదరుడు చొప్పదండిలోని ఒక రైస్ మిల్లులో పనిచేస్తున్నాడు. ఐదుగురు అన్నదమ్ములు కాగా నితీష్ చిన్నవాడు. కాగా కామారెడ్డిలో పనిచేస్తున్న తన మరో సోదరుడిని నితీష్ కుమార్ తనకు ఒక స్మార్ట్ ఫోన్ కొనివ్వాల్సిందిగా కోరాడు.
అయితే, ప్రస్తుతం తన వద్ద డబ్బులు లేవని, తర్వాత తప్పకుండా కొనిస్తానని సోదరుడు చెప్పాడు. నితీష్ ను బీహార్ కు పంపే క్రమంలో దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నితీష్ కుమార్.. చొప్పదండిలోని సదరు రైస్ మిల్లులోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేవలం ఫోన్ కొనివ్వలేదన్న క్షణికావేశంలో యువకుడు ప్రాణాలు తీసుకోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. క్షణికావేశంలో తీసుకునే ఇలాంటి నిర్ణయాలు కుటుంబాల్లో ఎంతటి శోకాన్ని మిగులుస్తాయో యువత గమనించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

