కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా అశ్వారావుపేట (Aswaraopeta) మండలంలో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మండల పరిధిలోని దిబ్బగూడెం గ్రామ పంచాయతీ గాడ్రాల గ్రామంలో పిడుగుపాటుకు (Lightning Strike) గురై జెడ్డి అరవింద్ (యువకుడు) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం, జెడ్డి అరవింద్ తన పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా ఒక్కసారిగా వాతావరణం మారి వర్షం ప్రారంభమైంది. వర్షం నుండి తలదాచుకునేందుకు అతను సమీపంలోని చెట్టు కిందకు వెళ్లాడు.
అదే సమయంలో ఆ చెట్టుపై భారీ పిడుగు పడటంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో గాడ్రాల గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఉపాధి కోసం పొలానికి వెళ్లిన యువకుడు ఇలా అకాల మరణం చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. అరవింద్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వర్షాలు కురిసే సమయంలో చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని, సురక్షిత ప్రాంతాలలో ఉండాలని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.

