కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్లోని ఎల్బీనగర్ (LB Nagar)లో షాకింగ్ ఘటన జరిగింది. ప్రభాస్ (Prabhas)పై కొందరు యువకులు దాడికి పాల్పడ్డారు. ప్రభాస్ అంటే రెబెల్ స్టార్ ప్రభాస్ అనుకునేరు.. అతడొక సాధారణ యువకుడు. రెస్టారెంట్ లో వాటర్ బాటిల్ కోసం మొదలైన గొడవ కాస్తా దాడికి దారి తీసింది. వివరాల్లోకి వెళ్తే.. భార్గవ్ రెడ్డి అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి ఎల్బీ నగర్ పరిధిలోని బ్యాట్స్ అండ్ బైట్స్ డ్రైవ్ ఇన్లో సరదాగా గడిపేందుకు వెళ్లాడు. అక్కడ రెస్టారెంట్ లో ఒక వాటర్ బాటిల్ కొనుగోలు చేసేందుకు వెళ్లాడు. తనకు కూల్ వాటర్ బాటిల్ కావాలని అడిగాడు. రెస్టారెంట్లో పని చేస్తున్న ప్రభాస్ అనే యువకుడు కూల్ వాటర్ బాటిల్ లేదని చెప్పాడు. ఆవేశంతో రెచ్చిపోయిన భార్గవ్ రెడ్డి యువకుడిపై దాడికి పాల్పడ్డాడు. అతడి స్నేహితులు కూడా ప్రభాస్ ను అక్కడి నుంచి పక్కకి లాక్కెళ్లి చితకబాదారు. ఎల్బీ నగర్ కాంగ్రెస్ నాయకుడు శశిధర్ రెడ్డి తన అన్న అంటూ, తన అన్న తలుచుకుంటే రెస్టారెంట్ లేకుండా చేస్తామంటూ బెదిరింపులులకు గురి చేశారు. ప్రభాస్పై దాడి చేయడంతో పాటు బండి తాళాలు, ఫోన్ లాక్కొని పరారయ్యారు. భార్గవ్ రెడ్డి, అతని స్నేహితులు దాడిలో తీవ్రంగా గాయపడ్డ ప్రభాస్ ఎల్నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

