కలం, మహబూబ్ నగర్ బ్యూరో: జిల్లాలో (Mahabubnagar) ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) అన్నారు. మహబూబ్ నగర్ లోని పాలమూరు గో ఆధార్ ఫార్మర్స్ (Organic Farming), మ్యూచువల్లి ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత కాలంలో వ్యవసాయంలో అధికంగా రసాయనాల వినియోగం వల్ల నేల నాణ్యత తగ్గిపోవడం, ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో రసాయనాలు, చీడపీడల మందులు వాడకుండా ఆర్గానిక్ పద్ధతిలో పంటలను పండించడం అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు. ఆర్గానిక్ వ్యవసాయం ద్వారా పండించిన పంటలు ఆరోగ్యకరంగా ఉండటంతో పాటు మార్కెట్లో కూడా మంచి డిమాండ్ కలిగి ఉంటాయని, రైతులు ఈ విధానాన్ని అవలంబించడం ద్వారా వారి ఆదాయం కూడా పెరగడమే కాకుండా సమాజానికి ఆరోగ్యకరమైన ఆహారం అందించవచ్చు అని ఆయన తెలిపారు.
ఆర్గానిక్ వ్యవసాయ సాగు దిశగా రైతులందరికీ అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఆర్గానిక్ పంటల మార్కెటింగ్కు తగిన సౌకర్యాలు కల్పించడంతో పాటు రైతులు సమూహాలుగా ఏర్పడి కలిసి పనిచేయాలని ఆయన సూచించారు. ప్రతి గ్రామంలో ఆర్గానిక్ వ్యవసాయంపై చైతన్యం పెంచుతూ, పండించిన పంటలను నేరుగా వినియోగదారులకు అందించే విధానాన్ని అభివృద్ధి చేయాలని, ముఖ్యంగా పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్గానిక్ ఆహారం వినియోగాన్ని ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో రైతులు, అధికారులు కలిసి సమన్వయంతో పనిచేసి ఆర్గానిక్ వ్యవసాయాన్ని విస్తరించే దిశగా కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఆర్గానిక్ వ్యవసాయం చేసేవారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అంతకుముందు ఆయన ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, పాలమూరు గో ఆధార్ ఫార్మర్స్ మ్యూచువల్లి ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సభ్యులు ముకుంద రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, వినోద్ కుమార్, రాజ్ గోపాల్ గౌడ్, దామోదర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అరుణ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ మరియు హార్టికల్చర్ అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

