కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రజా సంక్షేమమే తమ ఎజెండా అని.. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) స్పష్టం చేశారు. హన్వాడ మండలంలోని దాచక్ పల్లి గ్రామలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
అన్ని వ్యవస్థలు ధ్వంసం చేశారు..
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ పాలనలో 10 సంవత్సరాలుగా అన్ని వ్యవస్థలు ధ్వంసం చేశారని ఆయన ఆరోపించారు. పేద ప్రజలకు హామీలు ఇచ్చి ఏఒక్క హామీ నిలబెట్టుకోలేదని, డబ్బాలాంటి ఇందిరమ్మ ఇండ్లు వద్దు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని ప్రజలను నమ్మించి దగా చేశారని ఆయన మండిపడ్డారు. అయినా సీఎం రేవంత్ రెడ్డి అన్ని వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. ప్రజల అవసరాల పరిష్కారానికే ప్రజా ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం..
మహిళలకు వడ్డీలేని రుణాలు, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్ కార్డులు, రేషన్ కార్డు కలిగిన వారికి సన్నబియ్యం, గృహ అవసరాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత బస్సు ప్రయాణంతోపాటుగా రేషన్ కార్డులు కలిగిన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ జీవిత భీమా అందిస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలనే ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. స్థానిక యువతకు ఉపాధి కల్పననే లక్ష్యంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లను ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహా రెడ్డి, మహబూబ్ నగర్ నగర డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి.మహేందర్, గ్రామ సర్పంచ్ శ్రీలత, ఉప సర్పంచ్ శంకర్ నాయక్, డీసీసీ ఉపాధ్యక్షులు వేముల కృష్ణయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టంకర కృష్ణయ్య యాదవ్, లింగం నాయక్, శంకర్ నాయక్, విజయ్ నాయక్, అబ్దుల్ హక్, తదితరులు పాల్గొన్నారు.

