కలం, స్పోర్ట్స్ : కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణ పతకం సాధించిన భారత బాక్సర్ సాక్షి చౌదరి (Sakshi Chaudhary) ఇప్పుడు ఆసియా గేమ్స్పై దృష్టి సారించింది. సెప్టెంబర్ 19 నుంచి జపాన్లో జరగనున్న ఆసియా గేమ్స్లో మరో ప్రతిష్ఠాత్మక టైటిల్ సాధించడమే తన లక్ష్యమని సాక్షి తెలిపింది. గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో మహిళల 51 కిలోల విభాగంలో సాక్షి అద్భుత ప్రదర్శన చేసింది. ఫైనల్లో ఇంగ్లండ్కు చెందిన రూబీ వైట్ను 5-0తో ఓడించి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.
టోర్నీలో సాక్షి ఒక్క మ్యాచ్లోనూ ఓటమి చవిచూడలేదు. ప్రీ క్వార్టర్ ఫైనల్ నుంచి ఫైనల్ వరకు మొత్తం ఐదు మ్యాచ్లలోనూ ఏకగ్రీవ నిర్ణయంతో విజయం సాధించింది. ఫైనల్లో ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన సాక్షి.. చురుకైన కదలికలు, పటిష్ఠమైన రక్షణ, కచ్చితమైన పంచ్లతో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచింది. చివరకు 5-0తో విజయం సాధించి స్వర్ణాన్ని అందుకుంది. కామన్వెల్త్ గోల్డ్ తన కల నెరవేరిన క్షణమని సాక్షి (Sakshi Chaudhary) పేర్కొంది. ఇప్పుడు తన పూర్తి దృష్టి ఆసియా గేమ్స్పైనే ఉందని తెలిపింది. దేశం కోసం ఆడటం తనకు ఎప్పుడూ ప్రేరణనిస్తుందని చెప్పింది. ప్రతి మ్యాచ్లో గత ప్రదర్శన కంటే మరింత మెరుగ్గా ఆడేందుకు ఇదే తనకు బలాన్నిస్తుందని సాక్షి తెలిపింది. కామన్వెల్త్ గేమ్స్లో నేర్చుకున్న విషయాలను ఆసియా గేమ్స్లో ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం వెంటనే శిక్షణ ప్రారంభించి, తన ఆటను మరింత మెరుగుపరుచుకునేందుకు సిద్ధమవుతోంది.

