కలం, క్రైమ్ బ్యూరో: హైదరాబాద్ గండిపేట మండలంలో రూ.వేల కోట్ల ప్రభుత్వ ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు నకిలీ పత్రాలు సృష్టించిన కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును (Brahma Naidu) సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజులుగా పరారీలో ఉన్న ఆయన్ను పోలీసులు శుక్రవారం తమిళనాడులోని కాంచీపురం ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. గండిపేట మండలంలో సర్వే నెం.18లోని 10 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని, రెగ్యులరైజేషన్ చేయించుకునేందుకు నిందితులు నకిలీ జీవోలు, రెవెన్యూ రికార్డులు సృష్టించినట్లు తహసీల్దార్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరిని లోతుగా విచారిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
రూ. 12 కోట్లతో కుట్ర..
మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడితో పాటు బొల్లా రమేష్, రాధాకృష్ణ , నిమ్మల కుటుంబ సభ్యులు ప్రభుత్వ భూమిని ఆక్రమించేలా నకిలీ జీవోలు, ఇతర పత్రాలు సృష్టించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. బ్రహ్మనాయుడు (Brahma Naidu) రూ.12 కోట్ల మేర ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. అందులో నిమ్మల కుటుంబ సభ్యులకు రూ.4 కోట్లు, ఇప్పటికే అరెస్టైన నిందితుడు రాధాకృష్ణకు రూ.4 కోట్లు, ఇతర సంబంధిత వ్యక్తులకు మరో రూ.4 కోట్లు చెల్లించినట్లు పోలీసులు గుర్తించారు.
బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్..
కేసులో తాను అరెస్టయ్యే అవకాశం ఉందని గ్రహించిన బొల్లా బ్రహ్మనాయుడు ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కేసు తీవ్రత, ప్రాథమిక ఆధారాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. హైకోర్టులో ఊరట లభించకపోవడం, పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేయడంతో బొల్లా బ్రహ్మనాయుడు పరారీలో ఉన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు నార్సింగి, సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు సంయుక్తంగా కలిసి బ్రహ్మనాయుడిని కాంచీపురం ప్రాంతంలో గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరికొంతమంది పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
Read Also: టీడీపీ ఎంపీ చిన్నిపై మాజీ ఎంపీ కేశినేని నాని సంచలన పోస్ట్
Follow Us On: Sharechat

