కలం, వెబ్ డెస్క్: వైసీపీ నేత, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మ నాయుడిని (Brahma Naidu) నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా గండిపేట్లో రూ.1,500 కోట్ల విలువైన పదెకరాల స్థలాన్ని ఆయన కబ్జా చేశారనే ఆరోపణలున్నాయి. ఫేక్ జీవోలతో విలువైన భూమిని కాజేసేందుకు ప్రయత్నించినట్లు కేసు నమోదైంది. నకిలీ పత్రాల ఆధారంగా భూమిని ఎకరాకు సుమారు రూ.3.5 కోట్ల చొప్పున విక్రయించేందుకు ప్రయత్నించారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. తమిళనాడులోని కాంచీపురంలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. అక్కడకు వెళ్లి అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొస్తున్నారు.
హై కోర్టును ఆశ్రయించినా..
పదెకరాల భూమిని ఫేక్ జీవోలతో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడంతో పాటు భూ లావాదేవీలకు సంబంధించిన ఒప్పందాల్లో బ్రహ్మనాయుడు పేరు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అంతేగాకుండా, కొన్ని బ్యాంకు లావాదేవీలు కూడా దర్యాప్తులో బయటపడ్డాయని వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని బ్రహ్మ నాయుడు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించినా.. కోర్ట్ నిరాకరించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.

