కలం, యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (Yadadri Temple) మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 29వ జాతీయ ఈ-గవర్నెన్స్ అవార్డుల (e-Governance Awards) ఎంపిక ప్రక్రియలో దేవస్థానం తుది దశకు చేరుకుంది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సదస్సులో దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జె.భవానీ శంకర్ పాల్గొని, ఆలయ డిజిటల్ సేవల పరివర్తనపై సమగ్రమైన ప్రజెంటేషన్ ఇచ్చారు.
దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ విభాగాల నుండి మొత్తం 802 దరఖాస్తులు రాగా, అందులో అత్యుత్తమ పనితీరు కనబరిచిన 32 ప్రాజెక్టులను మాత్రమే షార్ట్లిస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్రం నుండి యాదగిరిగుట్ట దేవస్థానం (Yadadri Temple) చోటు దక్కించుకోవడం విశేషం. రెండవ దశలో భాగంగా, 2026 ఏప్రిల్ 8, 19వ తేదీలలో జాతీయ అవార్డుల బృందం యాదగిరిగుట్టను ప్రత్యక్షంగా సందర్శించి డిజిటల్ సేవల అమలును పరిశీలించింది. క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా ఎంపికైన దేవస్థానం బృందం గురువారం ఢిల్లీలో జ్యూరీ సభ్యుల ముందు తుది ప్రజెంటేషన్ ఇచ్చింది.
ప్రాజెక్ట్ హెడ్ వివరించిన అంశాలపై జ్యూరీ సానుకూలత వ్యక్తం చేసింది. యాదగిరిగుట్ట దేవస్థానం భక్తులకు పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించేందుకు వినూత్న డిజిటల్ విధానాలను అమలు చేస్తోంది. ఆన్లైన్ దర్శనం టికెట్లు, ప్రసాదం వితరణ, వసతి గదుల బుకింగ్, క్యూ మేనేజ్మెంట్లో తీసుకువచ్చిన సాంకేతిక మార్పులు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నాయి. తెలంగాణ తిరుపతిగా ఖ్యాతి గడిస్తున్న యాదగిరిగుట్ట దేవస్థానం, భక్తుల సౌలభ్యం కోసం ఐటీ రంగంలో చేస్తున్న కృషికి ఈ గుర్తింపు దక్కడం గర్వకారణం. ఈ జాతీయ స్థాయి గుర్తింపు దేవస్థాన గౌరవాన్ని మరింత పెంచింది. కాగా, డిజిటల్ పరివర్తన ద్వారా సమర్థవంతమైన పాలనను అందిస్తున్న యాదగిరిగుట్ట దేవస్థానం, ఈ ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకుంటుందన్న ధీమాతో అధికారులు ఉన్నారు.
Read Also: తక్కువ ఖర్చుతో ఇంటిని ఇంద్రభవనంలా మార్చే టిప్స్ ఇవిగో!
Follow Us On: Sharechat

