కలం, వెబ్ డెస్క్ : యాదాద్రి భువనగిరి (Yadadri) జిల్లా బీబీనగర్ మండలంలోని గొల్లగూడెం గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కన్నబిడ్డలని కడతేర్చి ఓ తల్లి తాను కూడా ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఐశ్వర్య అనే మహిళ తన ఇద్దరు చిన్నారులు, రెండేళ్ల పాప, పది నెలల బాబును దారుణంగా హత్య చేసి, అనంతరం తానూ బలవన్మరణానికి పాల్పడింది.
గత కొంతకాలంగా భర్తతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా ఐశ్వర్య తన పుట్టింట్లోనే నివాసం ఉంటోంది. అయితే తీవ్రమైన కుటుంబ కలహాలే ఈ అఘాయిత్యానికి ప్రధాన కారణమని అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

