కలం, యాదగిరిగుట్ట: ప్రభుత్వం చేపట్టిన భూ నక్షా సర్వేతో రికార్డుల్లో పారదర్శకత పెరగడంతో పాటు భవిష్యత్తులో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. యాదగిరిగుట్ట (Yadagirigutta) మున్సిపాలిటీ పరిధి యాదగిరిపల్లిలో చేపట్టిన నక్షా సర్వే కార్యక్రమాన్ని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డితో కలిసి పరిశీలించారు.
సర్వే బృందాలు వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, నివాస గృహాలు, ప్లాట్ల వాస్తవ హద్దులను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎలా నిర్ధారిస్తున్నారో పర్యవేక్షించారు.
భూ యజమానులకు సమాచారం..
ఈ సందర్భంగా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ.. ప్రతి సర్వే ప్రక్రియ నిబంధనల మేరకు నిర్వహిస్తూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సర్వే సమయంలో భూ యజమానులకు పూర్తి సమాచారం అందిస్తూ, వారి అభ్యంతరాలను పరిష్కరించాలని సూచించారు.
నాణ్యతతో, వేగవంతంగా నక్షా సర్వేను పూర్తి చేసి ప్రతి ఆస్తికి కచ్చితమైన హద్దులను నిర్ధారించాలన్నారు. ఈ పరిశీలనలో రెవెన్యూ అధికారులు, జిల్లా ల్యాండ్ అండ్ సర్వే అధికారి సుజాత, సర్వే బృందాల సిబ్బంది పాల్గొన్నారు.

